సెప్టెంబర్ 19న ఎథిక్స్ కమిటీ మీటింగ్..కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణపై కమిటీ అసంతృప్తి

సెప్టెంబర్ 19న ఎథిక్స్ కమిటీ మీటింగ్..కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణపై కమిటీ అసంతృప్తి
  • దీనిపైనే చర్చించి అసెంబ్లీకి తుది నివేదిక ఇవ్వనున్న కమిటీ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఈ నెల 19న జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సభలో సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై అనుచితంగా వ్యవహరించిన తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసు ఇచ్చింది. దీనికి ఆయన ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేయని కమిటీ.. సమగ్రంగా చర్చించి తదుపరి చర్యల కోసం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.

ఈ మేరకు సభ ఆమోదం పొందిన కమిటీ.. ఈ నెల 19న  సమావేశం కానుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల వరకు కౌశిక్ రెడ్డిపై పూర్తి నివేదిక సభ ముందు ఉంచేందుకు ఎథిక్స్ కమిటీ స్పీకర్ అనుమతి తీసుకుంది. దీంతో ఈయన విషయంలో కమిటీ తీసుకోబోయే చర్యలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.